కలం, నిర్మల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండో దశలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు (Ramchander Rao) పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. శనివారం హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన SIR రెండో దశ కార్యశాలలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులతో పాటు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రితీష్ రాథోడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. SIR ప్రక్రియలో బీజేపీ కార్యకర్తలు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని అభినందించారు. ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు SIR ప్రక్రియలో అక్రమంగా అర్హత లేని వ్యక్తులకు చోటు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పరిణామాలపై కార్యకర్తలు తక్షణమే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్ల జారీపై కూడా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ శక్తులకు చట్టబద్ధత కల్పించే విధంగా ఇలాంటి సర్టిఫికెట్ల జారీ జరుగుతున్నట్లయితే వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని నాయకులకు సూచించారు.

