కలం, నల్లగొండ: రోడ్లు, ఫుట్పాత్లు, బహిరంగ ప్రజా ప్రదేశాల్లో మటన్, చేపలు విక్రయించడం పూర్తిగా చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నగరపాలిక నల్లగొండ (Nalgonda ) మున్సిపల్ కమిషనర్ బి. వంశీ కృష్ణ హెచ్చరించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019 ప్రకారం పట్టణంలో పారిశుధ్యం, ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సరైన మున్సిపల్ అనుమతి, ప్రామాణిక లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే మాంసం విక్రయాలు జరపాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆదివారాల్లో ఫుట్పాత్లు, రోడ్ల పక్కన తాత్కాలిక షెడ్లు వేసి మటన్, చేపలు అమ్మే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మాంసం విక్రయాల వల్ల వచ్చే వ్యర్థాలను రోడ్లు, మురికికాల్వలు, బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే బాధ్యులపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారి వ్యాపారాలను తక్షణమే నిలిపివేయడంతో పాటు ఆక్రమణలను తొలగిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే దుకాణాలను సీజ్ చేయడం, సామగ్రిని స్వాధీనం చేసుకోవడం, వారి వ్యాపార లైసెన్సులను కూడా రద్దు చేస్తామని, పట్టణంలో పారిశుధ్య లోపం తలెత్తకుండా, ప్రజారోగ్యానికి విఘాతం కలగకుండా వ్యాపారులు, విక్రేతలు అధికారులకు సహకరించాలని కమిషనర్ బి. వంశీ కృష్ణ కోరారు.

