కలం, సినిమా : ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ముంబై నగరంలో మరో లగ్జరీ ప్రాపర్టీని సొంతం చేసుకున్నారు. నగరంలోని అత్యంత ఖరీదైన, ప్రీమియం ప్రాంతాల్లో ఒకటైన వర్లిలో ఆమె ఈ అపార్ట్మెంట్ను కొనుగోలు చేయడం విశేషం. శ్రేయ ఘోషల్ తన తల్లిదండ్రులు షమిష్టా ఘోషల్, బిశ్వజిత్ ఘోషల్తో కలిసి సుమారు రూ.29.70 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్ ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయిన గోద్రెజ్ ట్రైలాజీలో ఉంది.
ఈ అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా దాదాపు 2,430 చదరపు అడుగులు కాగా, మొత్తం విస్తీర్ణం 2,750 చదరపు అడుగులుగా ఉంది. అంతేకాకుండా మూడు కార్ పార్కింగ్ సదుపాయాలు కూడా కేటాయించబడ్డాయి. ఈ అపార్ట్మెంట్ కొనుగోలు ప్రక్రియ 2026 ఏప్రిల్ 1న అధికారికంగా నమోదు అయింది. ఈ డీల్లో భాగంగా రూ.1.78 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ముంబైలో ప్రీమియం ప్రాంతంలో లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం ద్వారా శ్రేయ ఘోషల్ మరోసారి వార్తల్లో నిలిచారు. సంగీత రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఆమె, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనూ ముందంజలో ఉన్నారు.

