కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలని నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్కు పీడీఎస్యూ (PDSU) ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ ప్రాంగణంలో పుస్తకాలు, యూనిఫామ్స్, షూ, టై , బెల్ట్ అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నారని తెలిపారు.
ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతూ వేలాది రూపాయలు ముక్కు పిండి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల తల్లిదండ్రుల బలహీనతలను ఆసరా చేసుకొని అడ్మిషన్ ఫీజు, ల్యాబ్, రోబోటిక్, గేమ్స్ పేరుతో ప్రైవేట్ పాఠశాలలు లక్షలాది రూపాయలు దోపిడీ చేస్తున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఒక్కో పాఠశాలను బట్టి నర్సరీ నుంచి పదవ తరగతి వరకు పదివేల నుండి రూ.1,50,000 వరకు అడ్డుగోలుగా ఫీజులు పెట్టి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు యూనిఫామ్ అమ్ముకున్న వాటిపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఫీజులను నియంత్రించడానికి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ (PDSU) నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్, నాయకులు మనోజ్, శ్రీకర్, భవాని, అరవింద్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Read Also: అందుకే విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకున్నా: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram

