కలం, వెబ్ డెస్క్: కర్ణాటకలో మంత్రి పదవులు దక్కలేదని ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంపై సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) స్పందించారు. “రాజకీయాల్లో రాజీనామాలు చాలా సాధారణం. ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే వారిని ఎవరూ ఆపరు. రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే పార్టీలోనే ఉంటారు. పార్టీని నమ్ముకుని ఉంటే అన్నీ అవే వస్తాయి. ధరం సింగ్, సిద్ధరామయ్య ప్రభుత్వాల్లో నాకూ మంత్రి పదవులు రాలేదు. డిప్యూటీ సీఎం పరమేశ్వరకు కూడా పదవి దక్కలేదు. అలాగని మేం పార్టీలు మారామా.. ఓపికతో ఉండలేదా..? అందరూ మంత్రులను వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లి, వెంటనే కరువు పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించాను” అన్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు..?
సోమవారం నాడు డీకే శివకుమార్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఈ సందర్భంగా మంత్రి పదవులు ఆశించిన ఇండి నియోజకవర్గ ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ, సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గోపాలకృష్ణ బేలూరుకు నిరాశే ఎదురైంది. దీంతో, తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్కు లేఖ పంపించారు. అయితే, ఇంకా స్పీకర్ ఆమోదించలేదు. మరోవైపు ఎమ్మెల్యేలను రాజీనామా ఉపసంహరించుకోవాలంటూ పార్టీ పెద్దలు వారిని బుజ్జగిస్తున్నట్లు సమాచారం. తొందరపడొద్దని.. త్వరలోనే మంచి అవకాశాలు వస్తాయని వారిని సముదాయిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

