కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో ఎరువులు అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ విధానం జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు (Khammam DAO Baburao) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా జిల్లాలో సరిపడా యూరియా నిల్వలను అందుబాటులో ఉంచామని, బుకింగ్ చేసుకున్న రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా వేగవంతంగా సరఫరా చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
జూన్ 19వ తేదీ నాటికి జిల్లావ్యాప్తంగా మొత్తం 10,014 మంది రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకోగా.. మొత్తం 39,944 బస్తాల యూరియా బుక్ అయింది. ఇందులో ఇప్పటికే 28,980 బస్తాలను రైతులకు విజయవంతంగా పంపిణీ చేశామని, దీంతో జిల్లాలో 72.66 శాతం సరఫరా పూర్తయిందని డీఏఓ (Khammam DAO) వివరించారు. ప్రస్తుతం జిల్లాలో అదనంగా 1,304.10 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, ఎరువుల కొరత వచ్చే ప్రసక్తే లేదని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు వేదికల ద్వారా ఎరువుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని బాబురావు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది, జిల్లా, మండల అధికారులు, అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ ఈ పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
రైతులు తమ పంటలకు అవసరమైన మేరకు మాత్రమే యూరియాను బుక్ చేసుకోవాలని, అంతకు మించి అధికంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి సూచించారు. యూరియా బుకింగ్, సరఫరా, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలు లేదా సందేహాల కోసం రైతులు తమ సమీపంలోని వ్యవసాయ విస్తరణ అధికారి, వ్యవసాయ అధికారి లేదా మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు.
Read Also: ఫోన్పే యూజర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ప్రతి 3 నెలలకు రూ.100 ఫైన్!
Follow Us On: Sharechat

