కలం, వెబ్ డెస్క్ : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ రీ-ఎగ్జామ్ (NEET UG Re-Exam)పై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు (Supreme Court) నిరాకరించింది. ఈ పరీక్షను వాయిదా వేయాలని, అత్యవసరంగా విచారణ జరపాలని విద్యార్థుల తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. విద్యార్థులు ఇప్పటికీ తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారని, అందువల్ల పరీక్షను వాయిదా వేయాలని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ నిరాకరించింది.
నీట్ పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలు ఇప్పటికే జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ ముందు జాబితా చేయబడి ఉన్నాయని, ఇందులో ఎలాంటి అత్యవసరత లేదని కోర్టు స్పష్టం చేసింది. రీ-ఎగ్జామ్ను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ నెల 21న యథావిధిగా పరీక్ష జరుగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది.

