కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) లో మత్తు పదార్థాల నియంత్రణపై అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధ్యక్షత వహిస్తూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మత్తు పదార్థాల నియంత్రణకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను సమీక్షిస్తూ, భవిష్యత్లో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలలో మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచేందుకు సోషల్ మీడియా సహా అందుబాటులో ఉన్న అన్ని వేదికలను వినియోగించాలని సూచించారు.
ప్రత్యేకంగా కల్తీ కల్లు తయారీలో వినియోగించే ఆల్ఫ్రాజోలమ్ వంటి రసాయనాలపై గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. క్లోరోఫామ్, డైజోఫామ్ వంటి ప్రమాదకర పదార్థాలతో తయారైన కల్తీ కల్లు సేవించడం వల్ల అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలలో మత్తు పదార్థాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలని, విద్యార్థుల్లో చైతన్యం పెంచాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. ప్రభుత్వం కూడా మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
ఎక్కడైనా గంజాయి, అల్ఫ్రాజోలమ్ వంటి మాదకద్రవ్యాల రవాణా లేదా విక్రయాలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో యాంటీ నార్కోటిక్స్ అధికారులు, ఎక్సైజ్ శాఖ, ఔషధ నియంత్రణ, విద్యా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: అజారుద్దీన్కు లైన్ క్లియర్ ?
Follow Us On: Instagram

