కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ (Mohammad Azharuddin) కంటిన్యూ కావాలంటే నామినేటెడ్ కోటాలో గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న ఫైల్ క్లియర్ కావడం అనివార్యం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30వ తేదీ నాటికి ఆరు నెలలు పూర్తికావస్తున్నందున అప్పటికల్లా ఆయనను ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. గవర్నర్ ఆమోదం తెలిపితేనే ఆయన ఎమ్మెల్సీ హోదాలో మంత్రిగా కొనసాగుతారు. లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ నిర్ణయం కూడా ఆ ఫైల్కు చెందినదే కావడంతో గవర్నర్ ఆమోదానికి ఎదురుచూపులు మొదలయ్యాయి. సుప్రీంకోర్టులో ఆదేశాల ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకోడానికి నిర్దిష్టమైన డెడ్లైన్ లేదు. కానీ అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఆరు నెలలు అవుతున్నందున 30 లోగా ఎమ్మెల్సీ కావడం తప్పనిసరి. అందువల్ల గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. ప్రభుత్వ వర్గాలు మాత్రం అజారుద్దీన్కు (Mohammad Azharuddin) లైన్ క్లియర్ అవుతుందని, మంత్రిగానే కొనసాగుతారన్న ధీమాను వ్యక్తం చేశాయి.
దీర్ఘకాలంగా సుప్రీంకోర్టులో విచారణ :
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ జర్నలిస్టు అమెర్ ఆలీఖాన్ను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తూ రాజ్భవన్కు మంత్రిమండలి పైల్ పంపింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత వీరిద్దరి ఎన్నికపై స్టే విధించడంతో ఆ వ్యవహారం అక్కడితో ముగిసింది. ఆ తర్వాత మరోమారు మంత్రివర్గం సమావేశమై ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్లను ఖరారు చేసి రాజ్భవన్కు ఫైల్ పంపింది. దీన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంత్రిమండలి సిఫార్సు చేసిన పేర్లపై గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని, ఒకవేళ పెండింగ్లో పెడితే వారు లేదా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది.
సుప్రీంకోర్టు సూచనతో బిగ్ రిలీఫ్ :
కొత్త సిఫార్సుల విషయంలో గవర్నర్ స్వయంగా నిర్ణయం తీసుకోవడానికి న్యాయపరమైన ఆటంకాలేవీ లేవని కోర్టు స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు ఈ విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసినప్పటికీ, నియామక ప్రక్రియపై మాత్రం ఎలాంటి నిషేధాన్ని విధించలేదు. రాష్ట్ర మంత్రివర్గం పంపిన సిఫార్సులను గవర్నర్ ఆమోదించడం ఆనవాయితీ. ఒకవేళ ఏవైనా అభ్యంతరాలున్నట్లయితే తిరిగి ప్రభుత్వానికి పంపొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా గవర్నర్ను కలిసి ఈ ఫైల్ను త్వరగా క్లియర్ చేయాలని కోరిన నేపథ్యంలో వారం పది రోజుల్లో రాజ్భవన్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు ఏప్రిల్ 22న తదుపరి విచారణ జరపనున్నందున వీరిద్దరి నియామకాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బంతి గవర్నర్ కోర్టులోనే ఉన్నందున ముఖ్యమంత్రి తాజా భేటీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది గమనార్హం.
Read Also: బోగస్ ఉద్యోగుల ఏరివేతకు సర్కార్ ప్లాన్
Follow Us On : WhatsApp

