కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందల్ వాయి మండలం ఎల్లారెడ్డి పల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆందోళనకు దిగారు. ఇందల్ వాయి దర్పల్లి రహదారిపై బైఠాయించి రైతుల ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డి పల్లికి చెందిన రైతులు మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గత 15 రోజుల నుండి వరి ధాన్యం కల్లాల్లోనే ఉంటుందని కొనుగోలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై వరి కుప్ప పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఐకెపి, సొసైటీ అధికారులపై రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం ఐకెపి కేంద్రం రద్దు చేసిందని ఒక సొసైటీ తోనే కొనుగోలు చేయడం లారీల కొరతతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని ధ్వజమెత్తారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యాన్ని నిరసిస్తూ రైతు స్థానిక బీజేపీ నేత శేఖర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన విరమింప జేయాలని పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా రైతులు వెనక్కి తగ్గలేదు. ఎమ్మార్వో రావాలని, హామీ ఇవ్వాలని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొనుగోళ్లు వేగవంతం చేస్తామన్న అధికారుల హామీతో రైతన్నలు రెండ్రోజుల డెడ్ లైన్ విధించి ఆందోళన విరమించారు.

