కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో లంచం అడిగాడని ఆర్టీసీ టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్, ప్రయాణికులు దాడి చేసిన ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను లంచం డిమాండ్ చేయలేదని, కండక్టర్ వసంత్ పురుష ప్రయాణికుడి నుంచి డబ్బులు తీసుకొని మహిళలకు ఇచ్చే మహాలక్ష్మి పథకం టికెట్ ఇచ్చాడని టికెట్ ఇన్స్పెక్టర్ ప్రకాశ్ ఆరోపించారు. ఈ విషయాన్ని తాను గుర్తించి మెమో జారీ చేస్తామని చెప్పడంతో తాను లంచం డిమాండ్ చేసినట్టు కండక్టర్ తప్పుడు ప్రచారం చేశాడన్నారు. అంతేకాకుండా వసంత్ ప్రయాణికులను రెచ్చగొట్టి తనపై దాడి చేయించాడని, తప్పుడు టికెట్ జారీపై ఆధారాలు లేకుండా ఛార్జీ మెమో బుక్ను, మహాలక్ష్మి పథకం టికెట్లను కూడా చింపివేశాడని ఆరోపించారు. కండక్టర్ వసంత్పై టికెట్ ఇన్స్పెక్టర్ ప్రకాశ్ రాయికోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గతంలోనూ కండక్టర్ వసంత్పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్టు ప్రకాశ్ ఆరోపించారు.

