కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో బడా పహాడ్ దర్శనం కోసం వెళ్తున్న భక్తుల బస్సు బోల్తా పడింది. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా పహాడ్ శివారు అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ప్రాంతానికి చెందిన సుమారు 35 మంది యాత్రికులు ఒక ప్రైవేట్ పాఠశాల బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
అటవీ మార్గంలోని ఒక మూలమలుపు వద్ద అకస్మాత్తుగా బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి బాధితులను మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు అక్కడ చికిత్స పొందుతున్నారు.

