టికెట్ ఇప్పిస్తానని మోసం: BJP నేతపై మహిళ సంచలన ఆరోపణలు!

కలం, వెబ్‌ డెస్క్ : నిజామాబాద్ (Nizamabad) కార్పొరేషన్ ఎన్నికల టికెట్ పేరిట తనను మోసం చేశారంటూ ఒక మహిళా నగరంలో ఆందోళనకు దిగడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో 49వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా టికెట్ ఇప్పిస్తానని నమ్మించి, తన వద్ద నుండి రూ. 1,50,000 వసూలు చేశారంటూ సదరు మహిళ ఆరోపిస్తోంది. బీజేపీ నాయకుడు బుస్సాపూర్ శంకర్ ఈ వసూళ్లకు పాల్పడ్డారని బాధితురాలు పేర్కొంది. శంకర్ మాటలు నమ్మి తాను మోసపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

చివరి నిమిషంలో టికెట్ వేరే వాళ్లకు కేటాయించడంతో, తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చేయాలని సదరు మహిళ కోరుతోంది. బాధితురాలు తన సొమ్ము కోసం ప్రాధేయపడుతుంటే, సదరు నేత వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే న్యాయం కావాలంటూ బాధితురాలు నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. తనను మోసం చేసిన సదరు నాయకుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

తనకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త అండదండలు ఉన్నాయని శంకర్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు వాపోయింది. ఈ బెదిరింపుల వ్యవహారంపై సదరు మహిళ జిల్లా పార్టీ కార్యాలయంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తూ, అగ్రనేతల పేర్లు వాడుకుంటూ బెదిరింపులకు దిగుతున్న శంకర్ పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతోంది. ఈ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>