హామీలు అమ‌లు చేయలేకపోతే రాజీనామా చేయండి: దినేష్ పటేల్

కలం, నిజామాబాద్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు స్వయంగా హామీ ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్ (ORR), బైపాస్ రోడ్ మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ (BJP) జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి (Dinesh Patel Kulachari) విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్ బీజేపీ (Nizamabad BJP) ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, జిల్లాకు ORR మంజూరు కాకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలు జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హామీ అమలు కాకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లాకు ORR తీసుకురాలేకపోతే వారు పదవుల్లో ఉండి ఏం ప్రయోజనం అని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని నాయకులకు పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదని, తమ సొంత పార్టీ కార్యాలయం కోసం నగర నడిబొడ్డున స్థలాన్ని కేటాయించుకున్న వారు, ప్రజలకు ఉపయోగపడే బస్టాండ్ కొరకు మాత్రం స్థలాన్ని గుర్తించలేకపోయారని ధ్వజమెత్తారు. మహేష్ గౌడ్ వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి ORR మంజూరు కోసం పోరాడాలని, లేకపోతే ఇందూరుకు ORR రాకపోవడానికి ఆయనే కారణమంటూ చరిత్రలో మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే అర్వింద్ ధర్మపురి నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు. అదే సమయంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నారని, ఇందూర్ అభివృద్ధి కోసం బీజేపీ ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోందని గుర్తుచేశారు.

కమిషన్ల బేరసారాల వల్లే ఫైలు పక్కన పడేశారా?: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన జిల్లాకు ORR తెచ్చుకోగలిగినప్పుడు, మహేష్ కుమార్ గౌడ్‌కు ఆ దమ్ము లేదా అని ప్రశ్నించారు. “లేక రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ మీ ఇద్దరి మధ్య ‘కమిషన్ల’ బేరసారాలు కుదరకనే ఇందూర్ ORR ఫైలును పక్కన పడేశారా? మీ వాటాల కోసం జిల్లా భవిష్యత్తును తాకట్టు పెడతారా?” అని నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందూరు గడ్డపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్లు, మేయర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతనకార్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, కార్పొరేటర్లు మల్కాయ్ మహేందర్, ఎర్రం సుధీర్, మల్లేష్ యాదవ్, బొబ్బిలి వేణుగోపాల్, శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి, కార్యాలయ కార్యదర్శి బద్దం కిషన్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు భూపతి, ఆనంద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>