కలం, వెబ్ డెస్క్ : బీహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
గత రెండు దశాబ్దాలుగా బీహార్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్, తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 2005 నవంబర్ 24న రాష్ట్రంలో మొదటిసారి ఎన్డీయే (NDA) ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటమే కాకుండా విద్య, వైద్యం, రహదారులు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం, ముఖ్యంగా మహిళలు, యువత కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఆయన వివరించారు.
రాబోయే ఐదేళ్ల కోసం (2025-2030) రూపొందించిన ‘7 నిశ్చయ్-3’ పథకం ద్వారా బీహార్ మరింత పురోగతి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ, బీహార్ త్వరలోనే దేశంలోని అగ్రగామి రాష్ట్రాల జాబితాలో చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉంటుందని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు నితీష్ కుమార్ (Nitish Kumar) అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Read Also: క్యాబినెట్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పేంటి?: జగ్గారెడ్డి
Follow Us On : WhatsApp

