కలం, నిర్మల్ : హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా మార్చే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని పలువురు ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం భవనంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో గణనీయమైన కోత పడటంతో పాటు ఉద్యోగ అవకాశాలు, సంక్షేమ పథకాలు, సాగునీటి వనరులపై తీవ్ర ప్రభావం పడుతుందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రజలు ఐక్యంగా వ్యతిరేకించాలని ప్రొ.వినాయక్ రెడ్డి పిలుపునిచ్చారు.
హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి అధిక ఆదాయం సమకూరుతుందని, యూటీగా మారితే తెలంగాణ ఆర్థికంగా బలహీనపడే ప్రమాదం ఉందని కె. వేణుగోపాల్, బి. కొండల్ రెడ్డి, జె.వి. చలపతి రావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు విరుద్ధమైన ఈ ప్రతిపాదనను ప్రజలు, పౌర సమాజం కలిసి అడ్డుకోవాలని టీజేఎసీ జిల్లా చైర్మన్ ఆరేపల్లి విజయకుమార్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు వాజిద్ అహ్మద్ ఖాన్, మాస్లైన్ జిల్లా కార్యదర్శి కే. రాజన్న, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.ఎన్. రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోశెట్టితో పాటు పలువురు ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

