కలం, జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో 3.55 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత వానాకాలంలో 3.85 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, ఈసారి సాగు విస్తీర్ణం స్వల్పంగా తగ్గనుంది. గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలోని 13 మండలాల్లో రైతులు పత్తి, వరి, వేరుశనగ, మిర్చి, మొక్కజొన్న, కంది తదితర పంటల సాగుకు పొలాలను సిద్ధం చేసుకున్నారు.
గత ఏడాది మంచి దిగుబడులు రావడంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నప్పటికీ, ప్రస్తుత ఎల్నినో ప్రభావం వల్ల జూలై రెండో వారం వచ్చినా వర్షాలు కురవకపోవడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వానాకాలం సాగుకు సంబంధించి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప తెలిపారు. వర్షాలు కురిసిన వెంటనే రైతులకు ఎలాంటి కొరత లేకుండా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయడానికి శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

