కలం, వెబ్ డెస్క్: మనిషి చివరి మజిలీలో కులాన్ని అడ్డుపెట్టి అంత్యక్రియలు ఆపిన దారుణ ఘటన సిద్ధిపేట (Siddipet)లో చోటు చేసుకుంది. తమ కులం కాదనే కారణంతో కుల పెద్దలు ఓ వ్యక్తికి స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించనివ్వలేదు. వివరాల్లోకి వెళ్తే… సిద్ధిపేటకు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో 70 ఏళ్ల నుంచి ఇక్కడే నివసిస్తున్నాడు. అనారోగ్యంగో శనివారం రాత్రి తుది శ్వాస విడిచాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని సిద్ధిపేట స్మశాన వాటికకు తీసుకెళ్లారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. మృతుడికి స్మశాన వాటికలో అంత్యక్రియలు జరపడానికి వీల్లేదని కుల పెద్దలు అడ్డుపడ్డారు.
మరణించిన వ్యక్తి తమ కులం కాదని వారు ఆరోపించారు. అంతటితో ఆగకుండా స్మశాన వాటికకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కుంటుంబసభ్యులు గేటు ముందే కన్నీరు మున్నీరుగా విలపించారు. ఎంతకీ కుల పెద్దలు కనికరించకపోవడంతో వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. 70 ఏళ్లుగా సిద్దిపేటలోనే నివాసం ఉంటున్నామని, అయినా తమను కులస్తులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వ్యక్తికి కుల సంఘంలో సభ్యత్వం, ఓటు హక్కు కూడా ఉన్నాయని వెల్లడించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

