కలం, వరంగల్ బ్యూరో : రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ఎమ్మెల్యేపై పరోక్ష విమర్శలు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి గ్రామానికి ఏం చేశాడని ప్రశ్నించారు. ఇంతకాలంలో ఇళ్లు , సీసీ రోడ్లు కూడా సరిగా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ప్రజలు తన ఎమ్మెల్యే పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి ఉండేదని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడంతో పాటు రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ.. కుర్చపల్లి గ్రామానికి తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని తెలిపారు. పెద్ద గ్రామం అయినప్పటికీ అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని అన్నారు. అయితే తాను ఎన్నికైన రెండు సంవత్సరాల్లోనే ఎస్సీ కాలనీలో రూ.45 లక్షలతో సీసీ రోడ్లు, ప్రధాన రహదారికి రూ.25 లక్షలతో సీసీ రోడ్, ఎస్డీఎఫ్ కింద రూ.10 లక్షలు, ఈజీఎస్ ద్వారా రూ.10 లక్షలు, మహిళా కమ్యూనిటీ హాల్కు రూ.5 లక్షలు, సబ్స్టేషన్ నిర్మాణానికి రూ.2.10 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. మొత్తం మీద కుర్చపల్లి గ్రామానికే రూ.4.10 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చినట్లు కడియం (Kadiyam Srihari) తెలిపారు.
గ్రామానికి గోదావరి జలాలు తీసుకురావడానికి నీటి పారుదల శాఖ అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు వారి సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం తన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, స్థానిక సర్పంచ్ బైకాని రాజు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Read Also: కేటీఆర్ పాదయాత్ర.. కేసీఆర్ భిన్నాభిప్రాయం
Follow Us On: X(Twitter)

