కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని మంత్రి వివేక్ వెంకట్ స్వామి (Minister Vivek Venkat Swamy) హామీ ఇచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని కార్మికులకు శ్రమశక్తి అవార్డులు (Shramshakti Awards) ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించాలంటే సమిష్టి కృషి అవసరమని చెప్పారు. ముఖ్యంగా కార్మికులకు నైపుణ్య శిక్షణ కీలకమని తెలిపారు. రాష్ట్రంలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీల) ద్వారా సుమారు 20,000 మంది యువతకు శిక్షణ అందిస్తున్నామని స్పష్టం చేశారు. కార్మికుల పిల్లలకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
బడ్జెట్లో కార్మిక శాఖకు రూ.90 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించినట్లు తెలిపారు. టామ్కామ్ (TOMCOM) ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. హమాలీల సంక్షేమానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని గిగ్, ప్లాట్ఫామ్ ఆధారిత కార్మికులకు చట్టబద్ధ రక్షణ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని.. వాటిని మరింత విస్తరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

