కలం, కరీంనగర్ బ్యూరో: గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ.. అభిషేక్ సింగ్వి లాంటి ప్రముఖ న్యాయవాదులతో సుప్రీంకోర్టులో సమర్థవంతంగా వాదించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.
కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఈ తీర్పు కొత్త ఊపునిస్తుందని.. పూర్తయితే లక్షల ఎకరాలకు సాగు నీరు, ప్రజలకు తాగు నీటి అవసరాలు తీరుతాయని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. తెలంగాణ హక్కుల పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ, ప్రభుత్వ న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని అభినందించారు.

