రోడ్డు భద్రతపై మంత్రి పొన్నం ప్రభాకర్ సందేశం

కలం, నిజామాబాద్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో ‘అరైవ్ అలైవ్’ పేరుతో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. నిజామాబాద్ నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ (Nizamabad) చేరుకున్న మంత్రికి.. కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య మంత్రి (Minister Ponnam) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకుని ‘అరైవ్ అలైవ్'(Arrive Alive) కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వరకు కొనసాగింది. అక్కడ విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడి రోడ్డు భద్రతపై సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక కుటుంబాలు ఈ ప్రమాదాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయని అన్నారు. చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ ప్రజలలో మార్పు రాకపోతే ప్రమాదాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. అందుకే పోలీసులు, రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణం ఆసుపత్రికి తరలించే వారికి “రహ్ వీర్” పథకం కింద రూ. 25 వేల ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి తెలిపారు. విద్యార్థులు, యువత ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>