కలం, కరీంనగర్ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన కుటుంబ సమస్యల వల్లే తీవ్ర అసహనంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) విమర్శించారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. కేటీఆర్ కుటుంబంలో ఒకవైపు కవిత సమస్య, మరోవైపు పార్టీ పదవిని లాక్కునేందుకు బావ ప్రయత్నిస్తుండటంతో కేటీఆర్ నిత్యం మానసిక అసహనానికి గురవుతున్నారని అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే రాష్ట్రంలోని 33 జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని మంత్రి హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రాబోయే మరో 20 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి అడ్లూరి ధీమా వ్యక్తం చేశారు.
కేటీఆర్ తల కిందకి, కాళ్లు పైకి పెట్టి తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని మంత్రి జోస్యం చెప్పారు. నాడు కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఎవరూ గొప్ప నాయకులు కాలేరని హితవు పలికారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, బీసీ, మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న ఎస్సీ, బీసీ, మైనార్టీల బిల్లులకు సంబంధించి రూ. 1000 కోట్లను విడుదల చేసి, వెంటనే చెల్లింపులు జరిపిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

