కలం, కరీంనగర్ బ్యూరో : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ప్రజా సమస్యలే పరిష్కారంగా సీఎం రేవంత్ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. 99 రోజులపాటు పది అంశాలపై ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు నివేదికలను తయారుచేసి దశలవారీగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి (Minister Adluri Laxman Kumar) హామినిచ్చారు.
ప్రభుత్వం ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యకు ప్రాధాన్యతనిస్తుందని ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి అడ్లూరి వెల్లడించారు. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు స్థలం కేటాయించామన్నారు. ఈ సందర్భంగా జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై నడుస్తున్న వివాదంపై మంత్రి స్పందించారు. కేంద్రీయ విద్యాలయానికి అవసరమైతే మరో మూడు ఎకరాల స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అడ్లూరి వెల్లడించారు.
జిల్లాలో ఈ ఏడాది అధిక మొత్తంలో వరి, మొక్కజొన్న దిగుబడులు వచ్చాయని ఇప్పటి వరకు జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామన్నారు. 2.60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు. ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని మంత్రి అడ్లూరి కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల ధర్మపురి మున్సిపల్ చైర్మన్లు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

