కలం, వెబ్ డెస్క్ : దేశంపై యుద్ధ ప్రభావం పడుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రధాని పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా అందరూ ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) పేర్కొన్నారు. ఇంధన ధరల భారాన్ని ప్రజలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమానంగా పంచుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై భారం తగ్గించే దిశగా బస్, మెట్రో, రైలు రవాణా ఛార్జీలను తక్షణమే తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంధన ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, ముఖ్యమంత్రులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్ను తగ్గించేలా ప్రధాని చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రాలు పరస్పర సహకారంతో పనిచేస్తేనే ప్రజలకు ఉపశమనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూడా అవసరానికి మించిన ఇంధన వినియోగాన్ని తగ్గించాలని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.

