కలం, నల్లగొండ బ్యూరో : మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU) పరిధిలోని డిగ్రీ (UG) సెమిస్టర్ పరీక్షలు మంగళవారం (ఏప్రిల్ 7) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విశ్వవిద్యాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మే నెల మొదటి వారం వరకు కొనసాగనున్నాయి. ఈసారి రెగ్యులర్, బ్యాక్లాగ్ విభాగాల్లో కలిపి 20 వేలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
సెమిస్టర్ వారీగా చూస్తే, రెండో సెమిస్టర్కు 8,500 మంది, నాలుగో సెమిస్టర్కు 6,110 మంది, ఆరో సెమిస్టర్కు 5,601 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షలను రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ కొనసాగుతుంది. ఉదయం సెషన్లో 2వ, 4వ, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులు, మధ్యాహ్నం సెషన్లో 1వ, 3వ, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU) పరిధిలోని మూడు జిల్లాల్లో మొత్తం 29 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 11, యాదాద్రి భువనగిరి జిల్లాలో 9, సూర్యాపేట జిల్లాలో 9 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్లను ముందుగానే డౌన్లోడ్ చేసుకోవాలని, నిబంధనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. మాల్ ప్రాక్టీస్కు ఎలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

