కలం, మెదక్ బ్యూరో : మద్యం వ్యసనం మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుందని నిరూపించేందుకు మెదక్ (Medak) జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటనే నిదర్శనం. తాగుడుకు డబ్బులు లేక, పేగు బంధాన్ని కాదనుకుని ఓ తండ్రి లక్షా 70 వేల రూపాయల కోసం కన్న బిడ్డను వేరే దంపతులకు అప్పగించాడు.
హవేలీ ఘనపూర్ (Haveli Ghanpur) మండలం లింగసానిపల్లి తాండాకు చెందిన మంజుల అనే మహిళ, మహిపాల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. మహిపాల్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మంజులతో ఉంటున్నాడు. గత నెల 10వ తేదీన మెదక్లోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో మంజుల మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే, మద్యానికి బానిసైన మహిపాల్, తాగుడు ఖర్చుల కోసం పసికందును విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. శిశువు పుట్టిన వారం రోజులకే కామారెడ్డికి చెందిన ఒక దంపతులకు లక్షా 70 వేల రూపాయలకు ఆ చిన్నారిని అమ్మేశాడు.
శిశువు కనిపించకపోవడంతో బంధువులు, స్థానికులు ప్రశ్నించగా మహిపాల్ వారితో దురుసుగా ప్రవర్తించసాగాడు. అనుమానం వచ్చిన వారు అధికారులకు సమాచారం అందించడంతో ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది. రంగంలోకి దిగిన అధికారులు వెంటనే స్పందించి, తల్లి మంజులతో పాటు శిశువును సురక్షితంగా సఖి కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Also: ఆ దేశంలో బంగారం ధరలు భారీగా పతనం
Follow Us On: X(Twitter)

