కలం, వెబ్ డెస్క్ : సిరియాలో విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డమస్కస్-డెయిర్ ఎజోర్ (Damascus-Deir ez-Zor) ప్రధాన రహదారిపై రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన (Syria bus crash)లో కనీసం 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర ప్రమాదంలో మరో 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి భద్రతా దళాలకు చెందిన బస్సు కాగా, మరొకటి సాధారణ ప్రయాణికులతో వెళ్తున్న సివిలియన్ బస్సు. తీవ్రమైన వేగంతో వస్తున్న ఈ రెండు బస్సులు డెయిర్ ఎజోర్ మార్గంలో ఒకదానినొకటి కొలైడ్ అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఒక బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక యంత్రాంగం, సహాయక సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిరియాలోని ఈ ప్రధాన రహదారులు సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరడం, గుంతలమయంగా మారడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై అక్కడి ఉన్నతాధికారులు పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.

