కలం, వెబ్ డెస్క్: సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న (Komuravelli Mallanna) భక్తుల చిరకాల స్వప్నం నేడు నెరవేరబోతోంది. రూ. 5.63 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం జరగనుంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ నూతన రైల్వే స్టేషన్ను మధ్యాహ్నం 3 గంటలకు అధికారికంగా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ – సిద్దిపేట రైలు సర్వీసులను ఈ మార్గంలో లాంఛనంగా ప్రారంభం కానుంది. మనోహరాబాద్ – కొత్తపల్లి కొత్త రైల్వే లైన్లో భాగంగా నిర్మించిన ఈ స్టేషన్ అందుబాటులోకి రావడం ద్వారా కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునే లక్షలాది మంది భక్తులకు రవాణా ఇబ్బందులు తొలగిపోయి ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఆధునిక వసతులు, ప్రయాణికుల సౌకర్యార్థం హై-లెవెల్ ప్లాట్ఫారమ్లు, విశ్రాంతి గదులు, సాంస్కృతిక వైభవాన్ని చాటేలా పెయింటింగ్స్తో ఈ స్టేషన్ను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ రైల్వే సౌకర్యం వల్ల ఈ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

