కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర (Delhi Terror Plot)ను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ, ముంబై నగరాల్లో భారీ పేలుళ్లకు వీరు పథకం రచించినట్లు సమాచారం. నిందితులను ఢిల్లీ, ముంబై, పంజాబ్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ టెర్రర్ గ్యాంగ్లో కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పలు మీడియా కథనాల ప్రకారం నిందితులు అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు విచారణలో తేలింది. పాకిస్థాన్ మద్దతు ఉన్న ఆపరేటివ్స్తో వీరు నిరంతరం టచ్లో ఉంటూ, దాడులు ఎక్కడ జరపాలనే దానిపై ఆదేశాలు అందుకుంటున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. గత కొన్ని వారాలుగా నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ తరుణంలో తాజా అరెస్టులు తీవ్ర కలకలం రేపాయి. ప్రస్తుతం వీరి ఆర్థిక మూలాలు, పాకిస్థాన్తో ఉన్న ఇతర సంబంధాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

