కలం వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ – ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో శనివారం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. అల్లూరి (Alluri) జిల్లా సరిహద్దుల్లోని ఈ పవర్ స్టేషన్లో సాంకేతిక కారణాలతో విద్యుత్ ఉత్పత్తిని షట్డౌన్ చేసి, అధికారులు మరమ్మతులు చేపడుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రమాదం జరిగిన సమయంలో జలవిద్యుత్ కేంద్రం రెండో అంతస్తులో పలువురు కార్మికులు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మంటల తీవ్రతకు దట్టమైన పొగ అలుముకోవడంతో వారంతా అక్కడే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్లాంట్ లోపలికి వెళ్లే మార్గాలన్నీ పొగతో నిండిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోందని తెలిపారు.ఈ విద్యుత్ కేంద్రం కొండల మధ్య మారుమూల ప్రాంతంలో ఉండటం వల్ల ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్లు చేరుకోవడంలో ఆలస్యమవుతోంది. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

