కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావొద్దని ప్రజలు పూజలు చేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి గ్రామంలో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ గొడ్డలి పార్టీ అని, ప్రజలు మరోసారి ఆ పార్టీని నమ్మకూడదని చెప్పారు. జగన్ ఇప్పటికీ నాటకాలు ఆడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. కోడి కత్తి, గులక రాయిడ్రామాలు చేసి ప్రజలను మోసం చేసే ఎత్తుగడలు చేశాడన్నారు. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో నీచ సంస్కృతి తీసుకొచ్చిందన్నారు. మాస్క్ అడిగినందుకు ఓ దళిత డాక్టర్ను చంపేశారన్నారు. చెల్లికి ఆస్తి ఇవ్వమన్నందుకు.. తల్లిని, చెల్లిని ఇద్దరిని వేధించాడన్నారు. తల్లిని, చెల్లిని ఏడిపించే వాడు ప్రజలను ఏం చూసుకుంటాడని ప్రశ్నించారు. మరో వైపు హిందూ దేవుళ్లపై దుష్ప్రచారం, ఆలయాలపై దాడులు చేశారన్నారు. ప్రజా స్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదని, సమాజానికి గొడ్డలి పార్టీ హానికరమని వ్యాఖ్యానించారు. మరోసారి ప్రజలెవరూ గొడ్డలి పార్టీ దగ్గరకు పోయే సాహసం చేయొద్దని చెప్పారు. ఆ పార్టీకి సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్లు అవుతుందని చెప్పారు.

