కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీరులో మరోసారి భీకర ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. రాజౌరి సెక్టారులోని గంభీర్ ముల్గాన్ ప్రాంతంలో కనీసం నలుగురు ముష్కరులు ఉన్నారనే నిఘా సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఉగ్రవాదులున్న ప్రాంతాన్ని చుట్టుముట్టగా.. జవాన్లపైకి కాల్పులు ప్రారంభించారు. వెంటనే స్పందించిన బలగాలు.. ముష్కరులపైకి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక ఉగ్రవాదిని జవాన్లు కాల్చి చంపారు. మరో ముగ్గురిని చుట్టుముట్టారు. ఈ ఘటనతో ఆర్మీ రాజౌరి సెక్టారులో అలర్ట్ ప్రకటించింది. అదనపు బలగాలను అక్కడికి తరలిస్తోంది. ఈ మేరకు సైన్యంలోని చీనార్ కార్ఫ్స్ రెజిమెంట్ అధికారికంగా తెలిపింది.
బుద్ధి మార్చుకోని పాకిస్థాన్..
పాకిస్థాన్ ఉగ్రవాదులను భారత్పైకి పంపిస్తే, ఆ దేశాన్ని చరిత్రలో కలిపేస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవలే హెచ్చరించినా.. పాకిస్థాన్ తీరు మార్చుకోవడం లేదు. ముష్కర మూకను కశ్మీరులోకి పంపిస్తూ.. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోంది. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని ఆర్మీ చీఫ్ కమాండర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

