కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు (Tamil Nadu) లో సంచలనం సృష్టించిన సాత్తాన్కుళం (Sathankulam) లాకప్ డెత్ కేసులో మదురై ఫస్ట్ అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మంది పోలీసులను దోషులుగా తేల్చి వారికి మరణశిక్ష విధించింది. కరోనా సమయంలో 2020 జూన్ 19 రాత్రి నిబంధనలకు విరుద్ధంగా టింబర్ షాప్ తెరిచి ఉంచారన్న ఆరోపణలతో సాత్తాన్కుళం పట్టణానికి చెందిన జయరాజ్ను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆయన కుమారుడు బెనిక్స్ ఆరా తీసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లగా, అతనిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరినీ రాత్రంతా లాకప్లో నిర్బంధించి, తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం జూన్ 22న కోవిల్పట్టి సబ్ జైలుకు తరలించిన తర్వాత, అదే రోజు రాత్రి బెనిక్స్ మృతి చెందగా, కొద్దిసేపటికే జయరాజ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. పోస్టుమార్టం నివేదికలో తీవ్ర గాయాలు, రక్తస్రావమే మరణానికి కారణమని తేలింది.
ఈ ఘటన (Sathankulam) దేశవ్యాప్తంగా ఆగ్రహానికి దారి తీసింది. దాంతో కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ దర్యాప్తులో, పోలీసులు అమానుషంగా హింసించి, లాకప్ గదిలో గోడలపై ఉన్న రక్తపు మరకలను బాధితుల చేతనే శుభ్రం చేయించినట్లు వెల్లడైంది. దాదాపు ఐదేళ్లపాటు విచారణ కొనసాగిన అనంతరం, మదురై జిల్లా ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్టు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించింది. బాధితుల మృతికి కారణమైన తొమ్మిది మంది పోలీసులను దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది.
మరణశిక్ష పొందినవారు : శ్రీధర్ (ఇన్స్పెక్టర్), రఘు గణేశ్ (ఎస్ఐ), బాలకృష్ణన్ (ఎస్ఐ), మురుగన్ (కానిస్టేబుల్), శ్యామదురై, ముత్తురాజా, సెల్వదురై, వెలిదుముత్తు, దినకరన్
ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసుకు కీలక మలుపు తిరిగింది. పోలీస్ దౌర్జన్యాలపై ఇది ఒక గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు.
Read Also: జమిలీ ఎన్నికపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

