కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేదలకు అందిస్తామని సీఎం (CM Revanth Reddy) తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాచారంలోని తెలంగాణ ఫుడ్ ఇండస్ట్రీలో నిర్మించిన బాలామృతం ప్లాంట్ ను సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.
ఇందిరా గాంధీ ఆలోచనలతో బాలామృతం కార్యక్రమం మొదలైందన్నారు. నాచారం బాలామృతం ప్లాంట్ ద్వారా నాలుగు రాష్ట్రాలకు సరఫరా జరిగేలా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని సీఎం తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరిటనే కేటాయిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు. 2034లోగా కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తానని సీఎం పునరుద్ఘాటించారు. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడితే ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవచ్చని పిలుపునిచ్చారు.

