కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ పరిపాలనను పారదర్శకంగా, క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఆధునిక, గౌరవప్రదమైన సేవలు అందించాలనే లక్ష్యంతో దశలవారీగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు భవనాల నిర్మాణాలపై మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. తొలివిడతలో అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న 107 తహసీల్దార్ కార్యాలయాలు, 10 ఆర్డీవో కార్యాలయాలకు రూ.263 కోట్లతో.. స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల రూ.97 కోట్లతో.. ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు.. నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో డీఐజీ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మొత్తం భవనాల కోసం రెండు విభాగాలకు సంబంధించి రూ.360 కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ భవనాలన్నీ ఒకే మోడల్ లో, ఆధునిక సౌకర్యాలతో నిర్మింస్తామని వివరించారు. ఈ నిర్మాణ బాధ్యతను తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు అప్పగించినట్లు వెల్లడించిన మంత్రి.. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలా భవన నిర్మాణాలు రూపొందిస్తామని తెలిపారు.

