కలం, వెబ్ డెస్క్ : గాజువాకలో రవాణా శాఖ అధికారుల తీరుపై తీవ్ర వివాదం నెలకొంది. విశాఖపట్నం (Visakhapatnam) షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్పై బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ దాడి చేశారు. లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపలేదన్న కారణంతో ఇన్స్పెక్టర్ పార్వతి లారీని ఓవర్టేక్ చేసి ఆపినట్లు సమాచారం. అనంతరం ఇన్స్పెక్టర్ సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం సృష్టించాడు. లారీ డ్రైవర్పై విచక్షణారహితంగా పిడిగుద్దులతో దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు రక్తస్రావమైనట్లు వీడియోలో కనిపిస్తోంది.
అయితే, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధులు నిర్వహించే అధికారుల సమక్షంలోనే లారీ డ్రైవర్పై దాడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లారీ డ్రైవర్ పై తన డ్రైవర్ దాడి చేస్తున్న బ్రేక్ ఇన్స్పెక్టర్ వారించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

