కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయిలో నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ (Prajavani) కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ (Collector Satya Prasad) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదుల స్వీకరణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలను ప్రారంభించినట్లు వారు తెలిపారు. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వస్తున్నందున వారి సమస్యలను సానుభూతితో విని, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణి ద్వారా ప్రజలకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ ఎంపీడీవో రమాదేవి, తహశీల్దార్ హకీమ్, ఎంపీఓ రవి బాబు, సంబంధిత అధికారులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

