కలం, వెబ్ డెస్క్: తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని 4 కోట్ల మందిని అవమానించిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుజరాత్ సీఎంకు పర్మిషన్ ఇచ్చి.. తనకు ఇవ్వకపోవడమేంటన్నారు. ఇది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వివక్షకు, గుజరాత్ ఆధిపత్యానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ సీఎంను అడ్డుకోవడమంటే.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే అన్నారు. విదేశాల్లో ఉండగా ఈ అంశంపై స్పందించి ఉంటే.. తనను దేశ ద్రోహి అనేవారని మండిపడ్డారు.
అందుకే హైదరాబాద్ వచ్చాకే మాట్లాడుతానని చెప్పినట్లు గుర్తు చేశారు. తన పర్యటన అడ్డుకున్నా లక్ష్యాన్ని అడ్డుకోలేకపోయారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తాను వెళ్లలేకపోయినా.. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి అధికారులను పంపించి ఒప్పందం చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రం వ్యవహరించిన తీరు ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమన్నారు.

