Mobile Popup Ad
Mobile Popup Ad

ఎక్కువసేపు ఏసీలో ఉంటే ఎముకలు బలహీనపడతాయా? నిపుణులు చెప్పిన నిజమిదే

కలం, వెబ్‌డెస్క్: సాంకేతికత పెరిగిన తర్వాత చాలామంది రోజులో 8 నుండి 10 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీ వాతావరణంలోనే గడుపుతున్నారు. అయితే ఎక్కువ సమయం ఏసీ గదుల్లోనే (Long Hours in AC) గడపడం వల్ల ఎముకలు బలహీనపడతాయా? మోకాళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీని గురించి నిపుణులు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు.

ఏసీ అనేది మనకు తక్షణ ఉపశమనాన్ని, సౌకర్యాన్ని కలిగించినప్పటికీ.. నిరంతరం ఏసీ గదుల్లోనే జీవించడం వల్ల మన శరీరం ప్రకృతి సిద్ధమైన వాతావరణానికి దూరమవుతోంది. దీనివల్ల ఆరోగ్యంపై కొన్ని పరోక్ష ప్రభావాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఏసీ వల్ల ఎముకలు నేరుగా బలహీనపడతాయా?

ఏసీ వాడకం వల్ల ఎముకలు నేరుగా బలహీనపడవు అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎముకల పటిష్టత అనేది మనం తీసుకునే కాల్షియం, విటమిన్ డి, సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, హార్మోన్ల సమతుల్యతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అయితే, రోజంతా ఏసీ గదులకే పరిమితం కావడం వల్ల శరీరానికి తగినంత ఎండ తగలదు. దీనివల్ల శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. దీర్ఘకాలం పాటు ఈ లోపం ఇలాగే కొనసాగితే, ఎముకలు క్రమంగా గుల్లబారి ‘ఆస్టియోపొరోసిస్’ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి ఏసీ నేరుగా ఎముకలను పాడుచేయనప్పటికీ, ఎండను దూరం చేయడం ద్వారా పరోక్షంగా వాటిని బలహీనపరుస్తుందని చెబుతున్నారు.

ఏసీ వల్ల కీళ్ల నొప్పులు వస్తుందా?

ఏసీ చల్లటి గాలి వల్ల కొత్తగా ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) వ్యాధి రాదు, అలాగే కీళ్లకు ఎలాంటి శాశ్వత నష్టం కూడా జరగదు. ఎయిర్ కండిషనర్ కేవలం గదిలోని ఉష్ణోగ్రతను మాత్రమే మారుస్తుంది కానీ కీళ్ల నిర్మాణాన్ని పాడు చేయలేదు. అయితే, ఇప్పటికే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి మాత్రం ఏసీ వాతావరణం వల్ల నొప్పులు, కీళ్ల బిగుతు, అసౌకర్యం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చల్లదనం వల్ల కీళ్ల చుట్టూ ఉండే కండరాలు కుంచించుకుపోయి ఈ నొప్పి పెరుగుతుందట. కాబట్టి ఈ తాత్కాలిక నొప్పి కేవలం వాతావరణ మార్పు వల్లే తప్ప, వ్యాధి తీవ్రత పెరగడం వల్ల కాదని గ్రహించాలని తెలిపారు.

ఏసీలో ఉండేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉష్ణోగ్రత నియంత్రణ

ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా కాకుండా 24°C నుండి 26°C మధ్య ఉంచుకోవాలని చెబుతున్నారు. మరీ తక్కువ టెంపరేచర్ పెడితే ఎముకలు, కండరాలు బిగుసుకుపోతాయి.

సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం

రోజులో కనీసం 15-20 నిమిషాల పాటు ఉదయం లేదా సాయంత్రం ఎండలో గడపాలి. విటమిన్ డి లభించడానికి ఉదయం 7 గంటల నుండి 8 గంటల మధ్య వచ్చే సూర్యరశ్మి అత్యంత ఉత్తమమైనది. అయితే మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ఎండలో ఉండటం మానుకోవాలి, దీనివల్ల చర్మం కమిలిపోయే (సన్‌బర్న్) అవకాశం ఉంది.

శారీరక శ్రమ

ఒకేచోట కూర్చోకుండా గంటకు ఒకసారి లేచి కొద్దిగా నడవడం లేదా స్ట్రెచింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. కఠినమైన వ్యాయామాలు చేయలేని వారు కనీసం ప్రతిరోజూ వాకింగ్ అలవాటు చేసుకోవాలి. ఇది ఎముకలకే కాకుండా జీర్ణ వ్యవస్థ సజావుగా సాగడానికి కూడా సహాయపడుతుంది.

కాల్షియం, విటమిన్ డి ఆహారం

ఎముకల బలానికి మీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. దీనికోసం రోజూ పాలు తాగడం, జున్ను (చీజ్), పెరుగు వంటి పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కాల్షియం పుష్కలంగా లభిస్తుందట. విటమిన్ డి లోపాన్ని సహజంగా అధిగమించడానికి ఆహారంలో స్వచ్ఛమైన నెయ్యిని చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

తగినంత నీరు తాగడం

ఏసీ గాలి ఒంట్లోని తేమను లాగేస్తుంది కాబట్టి, డీహైడ్రేషన్ బారిన పడకుండా క్రమంగా నీరు తాగుతూ ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>