కలం, వెబ్ డెస్క్: ప్రకాశం (Prakasam) జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలకు విషం పెట్టి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చీమకుర్తి మండలం అగ్రహారంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. అగ్రహారం గ్రామానికి చెందిన సుధాకర్ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివసించే వాడు. సుధాకర్కు తన భార్యతో తరచూ గొడవలు జరిగేవి. దీంతో అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి పుట్టింట్లో ఉంటోంది. కొద్ది రోజుల నుంచి సుధాకర్ ఒక్కడే పిల్లలను చూసుకుంటున్నాడు.
రోజులు గడుస్తున్నా భార్య పుట్టింటి నుంచి రాకపోవడంతో సుధాకర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పిల్లలతో పాటు తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. గురువారం రాత్రి తన ముగ్గురు పిల్లలకు విషం కలిపిన ఆహారం పెట్టాడు. తాను కూడా అదే విషం తాగాడు. అనంతరం చెట్టుకు ఉరి వేసుకున్నాడు. దీంతో కుమార్తెలు గోచిత, పూజిత, లోకితలతో పాటు సుధాకర్ ప్రాణాలు విడిచారు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబ కలహాలు జరిగేవని, సుధాకర్ ఆత్మహత్యకు కూడా అదే కారణం అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

