కలం, వెబ్ డెస్క్: ఏపీలో పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని అటవీ ప్రాంతంలో అరణ్యరామం ప్రాజెక్టు (Aranyaramam Project)కు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర స్థాయిలో అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ నిర్వహణ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.27 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను ప్రభుత్వం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కు అప్పగించింది.
ఈ కేంద్రంలో మానవ, వన్యప్రాణి సంఘర్షణ నివారణ కేంద్రం, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ సెంటర్, ఎలిఫెంట్ మానిటరింగ్ సెంటర్లు అందుబాటులో ఉండనున్నాయి. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, భవిష్యత్ తరాలకు ప్రకృతి సంపదను అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భూమి పూజా కార్యక్రమంలో పవన్ కల్యాణ్తో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

