కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ (Lalit Modi) మరోసారి బీసీసీఐపై (BCCI) విరుచుకుపడ్డారు. లీగ్ సంప్రదాయ ఫార్మాట్ను మార్చడం వల్ల వేల కోట్ల ఆదాయం గాలిలో కలిసిపోతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ బోర్డు ఐపీఎల్ను ప్రారంభించినప్పుడు లలిత్ మోదీ కమిషనర్గా వ్యవహరించారు. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, లీగ్లోని హోమ్ అండ్ అవే ఫార్మాట్ను పక్కన పెట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పది జట్లు ప్రతి జట్టుతోనూ తమ సొంత మైదానంలో ఒకటి, ప్రత్యర్థి మైదానంలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉందని మోదీ గుర్తు చేశారు.
2022లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ వచ్చి చేరిన తర్వాత ఈ సంప్రదాయానికి విరామం పడింది. ఇలా ఫార్మాట్ మార్చడం వల్ల బీసీసీఐ తన ఆదాయాన్ని కోల్పోతోందని ఆయన విమర్శించారు. నిజానికి ప్రతి మ్యాచ్ ఆదాయంలో 50 శాతం బోర్డుకు, మిగతా 50 శాతం జట్లకు అందుతుంది. హోమ్ అండ్ అవే పద్ధతి లేకపోవడం వల్ల జట్లు ఏటా 20 మ్యాచ్లను నష్టపోతున్నాయని మోదీ వివరించారు. ఫ్రాంచైజీలు చెల్లిస్తున్న ఫీజుల దృష్ట్యా, వారికి పూర్తిస్థాయి మ్యాచ్లు నిర్వహించడం బోర్డు బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ క్యాలెండర్లో తగినంత సమయం లేకపోతే, జట్ల సంఖ్యను పెంచకుండా ఉండాల్సిందని ఆయన (Lalit Modi) అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఐపీఎల్లో 74 మ్యాచ్లు జరుగుతుండగా, పాత పద్ధతి పాటిస్తే ఆ సంఖ్య 94కు చేరుతుంది. దీనివల్ల మీడియా హక్కుల ద్వారా అదనంగా 2,400 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఈ అదనపు ఆదాయం బోర్డుతో పాటు పది జట్లకు సమానంగా పంపిణీ అయ్యేదని, తద్వారా జట్ల విలువ కూడా పెరిగేదని మోదీ పేర్కొన్నారు.
Read Also: మూడు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
Follow Us On: Instagram

