కలం, వలిగొండ: కేంద్ర ప్రభుత్వం అలసత్వం వల్లే రైసు మిల్లుల్లో నిల్వలు పేరుకుపోయాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbham Anil Kumar Reddy) తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని హనుమాన్, లక్ష్మీ నర్సింహ రైస్ మిల్లులను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మిల్లుల్లోని ధాన్యం నిల్వలను పరిశీలించి.. మిల్లర్లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నిల్వ సామర్థ్యం, రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన ధాన్యం ఇంకా మిల్లుల్లోనే నిల్వ ఉండిపోవడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో రైస్ను కొనుగోలు చేయకపోవడం వల్లే ప్రస్తుతం మిల్లుల్లో స్థలం లేక ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు.
సమస్యలను సకాలంలో పరిష్కరించాలి..
కేంద్రం గనుక సకాలంలో స్పందించి ఉంటే రైతులకు, మిల్లర్లకు ఈ ఇబ్బందులు వచ్చేవి కావన్నారు. ధాన్యంలో నల్లమచ్చ, తాలు వంటి సమస్యల కారణంగా రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులకు నష్టం చేకూర్చే పనులు చేయవద్దని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ రైస్ మిల్లర్లకు అండగా ఉంటుందని, అయితే అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని మిల్లర్లకు స్పష్టం చేశారు. తరుగు పేరుతో రైతుల నుంచి ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని కట్ చేస్తూ వారిని ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదురైనా, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు అందుబాటులో ఉండి పరస్పర సమన్వయంతో వాటిని వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

