కలం, కరీంనగర్ బ్యూరో: రామగుండం (Ramagundam) నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష (Koya Sriharsha) సూచించారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గంలో చేపడుతున్న మెడికల్ కళాశాల నిర్మాణ పనులు, మున్సిపల్ రోడ్ల అభివృద్ధి, రెవెన్యూ శాఖ పనులు, డ్రెయినేజీ నిర్మాణాలు, ఆర్ & బి, పంచాయతీరాజ్ శాఖ పనులు, 2బిహెచ్కే గృహ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు.
అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులో పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏ పని కూడా ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల అమలులో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడంలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని, పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు సురేష్, బి. గంగయ్య, సీపీఓ రవీందర్, ఈఈ పీఆర్, ఆర్&బి ఈఈ భావ్ సింగ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

