కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. ధాన్యం కుప్పల మీదే రైతన్నలు కుప్పకూలుతున్నారని.. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు సైతం కుప్పకూలాయని పేర్కొన్నారు. రైతులు రాలిపోతున్నా రేవంత్ రెడ్డి చలనం లేని రాక్షస పాలన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల చావులను చూసి ఆనందిస్తున్నవా.. ముఖ్యమంత్రి? అంటూ ఫైర్ అయ్యారు.
గుండెలు ఆగిపోతున్నా.. కనికరం కలగడం లేదా?
కొనుగోలు కేంద్రాల వద్ద మండుటెండల్లో రైతుల గుండెలు ఆగిపోతున్నా.. కనికరం కలగడం లేదా ఈ కర్కశ ప్రభుత్వానికి? అని కేటీఆర్ ప్రశ్నించారు. పండించిన పంటలు కొనకుండా ఇంకెంత కాలం యాతన పెడతారు ఇంకెన్ని చావులు కావాలి.. ఇంకెన్ని కుటుంబాల రోడ్డున పడాలి? అని మండిపడ్డారు. దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఇకనైనా సోయి తెచ్చుకొని .. కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోలుపై చిత్తశుద్ధితో చర్చించాలని పేర్కొన్నారు.పంట కొనుగోళ్లను పూర్తి చేయాలని.. రైతన్నల తిప్పలు తప్పించాలని కోరారు.

