కలం, వరంగల్ బ్యూరో: ఉర్సు చెరువు (Ursu Cheruvu) బండ్ సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయ్ (Chahat Bajpai), సత్య శారదా అధికారులను ఆదేశించారు. శనివారం ఉర్సుగుట్ట రంగసముద్రం చెరువు బండ్ సుందరీకరణ, అభివృద్ధి పనుల పురోగతిని వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నాణ్యత, పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్లు, అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. అదేవిధంగా చెరువు బండ్ పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన వాతావరణం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో బల్దియా ఇంజినీర్ సంతోష్ బాబు, సిటీ ప్లానర్ రవీంద్ర రాడేకర్, తహసీల్దార్ ఇక్బాల్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

