కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించేందుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంటి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్యే తానుంటున్న నివాసంలో అడ్రస్ తో సహా పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పొందడం దారుణం అని మండిపడ్డారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటి? అని కేటీఆర్ నిలదీశారు.
65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారన్నారు. అసలు పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీ చేతిలో కీలుబొమ్మల్లా.. ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా? అని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ‘చట్టం, న్యాయం, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు.. కానీ మాకు వాటి మీద పూర్తిగా విశ్వాసం ఉంది. ఈ అక్రమ కేసులన్నీ ఛేదిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే వారు బుద్ధి చెబుతారు’ అని కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.


