కలం, ఖమ్మం బ్యూరో: ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించడమే ధ్యేయంగా ‘ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు (Koonamneni Sambasiva Rao) తెలిపారు. ‘మన కోసం.. మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో భాగంగా గురువారం పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో ‘ప్రజలతో ముఖాముఖీ’ కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, లబ్ధిదారులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సందర్భంగా వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే కూనంనేని.. వాటిని తక్షణమే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మౌలిక వసతుల కల్పనతోనే బస్తీలు, గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సీపీఐ నాయకులు ముత్యాల విశ్వనాథం, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, పాటు వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

