కలం, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టినవారిపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court)లో భారీ ఊరట లభించింది. ఢిల్లీ ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు ఆందోళనకారులపై నమోదైన కేసులను మూసివేసేందుకు అవకాశం కల్పిస్తూ తీర్పు వెలువరించింది. ఈ విషయంలో రాష్ట్రాలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు దాఖలైన ఓ పిటిషన్ విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ప్రకటించింది.
వారికి మినహాయింపు లేదు..
సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ల విషయంలో సమాచారం లోపం ఉంది. వాటిని ప్రభుత్వం పరిశీలిస్తోంది. విద్యార్థులు స్వేచ్ఛగా ముందుకు వచ్చి, ఈ అంశంలో ప్రభుత్వంతో చర్చించవచ్చు. అయితే, ఆందోళనల ముసుగులో అల్లర్లకు పాల్పడినవారిని మాత్రం కచ్చితంగా శిక్షించాల్సి ఉంటుంది. వారి వివరాలు సేకరిస్తున్నాం. కొందరు ఘర్షణ పెట్టుకోవాలని చూస్తున్నారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదు’ అని స్పష్టం చేశారు.

